వైసీపీ హయాంలో జనాల కష్టాలను పట్టించుకోలేదు: కేంద్ర మంత్రి పెమ్మసాని
- మినీ మహానాడులో పెమ్మసాని కీలక వ్యాఖ్యలు
- వైసీపీ హయాంలో ప్రజా వ్యతిరేకత పెరిగిందని వ్యాఖ్య
- గుంటూరును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ
గుంటూరు వేదికగా జరిగిన టీడీపీ మినీ మహానాడులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక సంస్కృతి పెరిగిందని, జనం ఎదుర్కొంటున్న కష్టాలను ఆ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదని, అది ఒక వ్యక్తి హృదయ స్పందన నుంచి పుట్టిన పార్టీ అని అభివర్ణించిన పెమ్మసాని, గత 40 ఏళ్లుగా చంద్రబాబు అత్యంత నిబద్ధతతో పార్టీని నడిపిస్తున్నారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీలో సముచిత గుర్తింపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ముఖ్యంగా గుంటూరు అభివృద్ధిపై పెమ్మసాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ అధికారాన్ని నిలబెట్టుకుంటే, గుంటూరు నగరాన్ని అమెరికా తరహాలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా కార్యకర్తలు ఆర్థికంగా స్థిరపడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.